Uncategorized

అర్హులైన వారి పింఛన్ల తొలగింపు ప్రసక్తే లేదు

#KondapalliSrinivas

అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాద్దాంతం, దుష్ప్రచారంలో ఏమాత్రం పసలేదని, ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సామాజిక భద్రతా పింఛన్లకు శ్రీకారం చుట్టింది, కాలాను గుణంగా పెంపుదల చేసింది తమ ప్రభుత్వమేనని, అటు వంటప్పుడు ఆ పింఛన్లను తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛను  పథకాన్ని తమ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్నదని, అందుకై బడ్జెట్ లో దాదాపు రూ.33 వేల కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. గత ఏడాది జూలై 1 నుండి ప్రతి మాసం 65.18 లక్షల మందికి రూ.2,700 కోట్లను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు.

పింఛను పొందుతున్నవారిలో స్వర్గస్తులు అవుతున్న వారి స్థానంలో భార్యకు వితంతు పింఛనను వెంటనే మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ విధంగా దాదాపు 1.10 లక్షల స్పౌస్ పింఛన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 63.71 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు.

తమ ప్రభుత్వం ఎటు వంటి పింఛన్లను తొలగించే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదని, అయితే గత ప్రభుత్వ హయంలో ప్రతి ఆరు మాసాలకు ఒక సారి సిక్స్ స్టెప్ వేలిడేషన్ ప్రక్రియ అంటూ దాదాపు 9.56 లక్షల పింఛన్లను  రద్దు చేయడం జరిగిందన్నారు. ఆ విధంగా రద్దు చేసిన వాటిలో దాదాపు 1.03 లక్షల దివ్యాంగ పింఛన్లు మరియు 14,177 ఆరోగ్య పింఛన్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు.

విభజన వల్ల రాష్ట్రం పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాధారణ పింఛన్లను రూ.3 వేల నుండి 4 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ.3 వేల నుండి 6 వేలకు, పూర్తిగా వికలాంగులైన వారి పింఛన్లను రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు దీర్ఝకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్లు రూ.5 వేల నుండి 10 వేల వరకు పెంచడం జరిగిందన్నారు.

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ  పింఛను పధకం దుర్వినియోగం అవుతున్నదని, గత ప్రభుత్వ హయాంలో  ఎన్నో బోగస్ పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని, ప్రత్యేకించి ఆరోగ్య మరియు దివ్యాంగుల కేటగిరీలలో కొంత మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు క్షేత్ర స్థాయి నుండి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు.

ప్రత్యేకించి డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు వై.ఎస్.ఆర్.కడప జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీల తదుపరి తమ జిల్లాల్లో అనర్హులైన వారు ఆరోగ్య మరియు దివ్యాంగుల కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.

గత పదిహేను ఏళ్ల నుండి దాదాపు 6.00 లక్షల దివ్యాంగ పింఛన్లను ఇవ్వడం జరుగుచుండగా, కేవలం గత ఐదేళ్లలోనే దాదాపు 2.07 లక్షల మందికి నూతనంగా దివ్యాంగుల పింఛన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అనర్హులకు బోగస్ సర్టిఫికేట్లు జారీచేసి పెద్ద ఎత్తున దివ్యాంగుల పింఛన్లను దుర్వినియోగం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

ఈ విషయాన్ని త్రీవ్రంగా పరిగణిస్తూ తమ ప్రభుత్వం సర్టిఫకేట్లను రీ-వెరిపై చేయాల్సినదిగా ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. గత తొమ్మిది మాసాల నుండి ఎంతో పారదర్శకంగా ప్రణాళికా బద్దంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుచున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 125 కేంద్రాల్లో స్లాట్ లను కేటాయించి మరీ  సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

అనారోగ్యుల విషయంలో వైద్యులే వారి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా దాదాపు 7.95 లక్షల మంది సర్టిఫికేట్లను రీ-వెరిపై చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 5.55 లక్షల మందికి సంబందించి రీ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ వెరిఫికేషన్ లో దాదాపు 80 వేల మంది అనర్హులను గుర్తించడం జరిగిందని, అయితే వారి అర్హతను బట్టి మరో కేటగిరీలో అర్హులుగా గుర్తిస్తూ కన్వర్టు చేయడం జరుగుచున్నదన్నారు. 

20 వేల మందిని వృద్దాప్య పింఛన్ల కేటగిరీలోకి మార్చడం జరిగిందన్నారు. అదే విధంగా 2016 ముందు జారీ చేసిన తాత్కాలిక సర్టిఫికేట్ల విషయంలో  కూడా ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేవలం 40 శాతం పైబడిన అంగవికలులకు కూడా దివ్యాంగ పింఛన్లను కొనసాగించడం జరుగుచున్నదన్నారు.

రీ-వెరిఫికేషన్లలో అనర్హులుగా గుర్తించిన వారందరికీ నోటీసులను కూడా జారీచేయడం జరిగిందని,  ఈ తనిఖీల్లో వారిని అర్హులుగా గుర్తిస్తే పింఛనును కొనసాగించడం జరుగుతుందన్నారు. సర్టిఫికేట్ల రీ-వెరిఫికేన్ విషయంలో ఎవరికన్నా అన్యాయం జరిగిందనుకుంటే వెంటనే సంబందిత అధికారులకు అప్పీలు చేసుకున్న వెంటనే వారి అర్హతలను మరో సారి పరిశీలించి అర్హత ఉంటే వెంటనే పింఛనను పునరుద్దరించడం  జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం

Satyam News

Leave a Comment

error: Content is protected !!