జాతీయంహోమ్

మధ్యప్రదేశ్ లో ఇక యూనిఫామ్ సివిల్ కోడ్

#MohanYadav

దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధపడ్డ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ చేరింది. ఆదివారం జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లును త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. “మాకు రామ్‌చంద్రుడైనా, రహీమ్ అయినా అందరూ సమానమే. ప్రతి పౌరుడికి సమాన న్యాయం అందించే దిశగా ఈ చట్టం ఒక కీలక అడుగు” అని ఆయన పేర్కొన్నారు.

బిల్లు రూపకల్పనకు ముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, విభాగాల్లో విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ సంప్రదింపుల ప్రక్రియకు దూరంగా ఉందని విమర్శించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ వంటి రాజకీయ పక్షాలు సంప్రదింపుల్లో పాల్గొన్నప్పటికీ కాంగ్రెస్ హాజరుకాలేదని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. “ఒక దేశం–ఒక చట్టం–ఒక నాయకత్వం అనే భావనను కాంగ్రెస్ ఎప్పుడూ పూర్తిగా అంగీకరించలేకపోయింది” అని ఆయన విమర్శించారు.

సంప్రదింపుల సందర్భంగా ముస్లిం సమాజం నుంచి కూడా గణనీయమైన మద్దతు లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ముస్లిం మహిళల్లో దాదాపు 80 శాతం మంది, పురుషుల్లో సుమారు 40 శాతం మంది ఏకరీతి పౌర స్మృతికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు.

ఈ చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించదని, వ్యక్తిగత చట్టాల్లో సమానత్వం, ఏకరూపతను తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారత్–2047 లక్ష్యానికి అనుగుణంగా, “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయత్న్” అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుసరణగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఇప్పుడు మధ్యప్రదేశ్ శాసనసభలో చర్చించి ఆమోదానికి తీసుకురానున్నారు. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేస్తున్న తదుపరి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలవనుంది.

Related posts

హత్య కేసులో నిందితులు అరెస్టు

Satyam News

చర్చలు ఫలప్రదం… బంధం మరింత పటిష్టం

Satyam News

పవన్ క్రియేటీవ్ వర్క్స్ మరో ప్రాజెక్టులో బిజీ

Satyam News

చేతిలో బైబిల్..చేతల్లో ద్రోహం…సొంత వర్గానికే జగన్ వెన్నుపోటు!

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

CBN Target: 2036 ఒలింపిక్స్‌కు వేదికగా అమరావతి

Satyam News

Leave a Comment