కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్తు దక్కనుందా.. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీయేలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు.. రాష్ట్రంలో పారిశ్రమిక అభివృద్ధికి ఊతం ఇస్తున్నారు.
కేంద్ర కేబినెట్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్.. కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. జనసేన పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నా.. కేంద్ర మంత్రి పదవి తీసకోలేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపించి.. కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టు ఇవ్వడంతో.. సెంట్రల్ మినిస్టర్ ఆప్షన్ క్లోజ్ అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. మరో బెర్తు దక్కితే.. రాయలసీమ ప్రాంతం నేతకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తే.. చిత్తూరు.. హిందూపురం ఎంపీల పేర్లు పరిశీలనలోకి వస్తాయి. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభార్రెడ్డికి కేంద్ర కేబినెట్ పదవి దక్కుతుంది.
గతంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాని టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో వేమిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన పేరు కేంద్ర మంత్రి పదవికి పరిశీలనలో ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ శాఖలు మారే అవకాశం ఉంది. రామ్మోహన్నాయుడుకి పౌర విమానయాన శాఖ బదులు.. మరో కీలకమైన పోర్ట్ఫోలియే కేటాయించే అవకాశం ఉంది. పెమ్మసానికి ప్రమోషన్ ఇచ్చి.. కేబినెట్ హోదాతో మంత్రి పదవి ఇస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ముందు ప్రాంతీయ, సమాజిక సమీకరణాలు లెక్కేసుకొని కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.
