ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు. వీరిలో సుమారు 2వేల మంది తెలుగు వారే ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.
దీంతో ఇక్కడ ఉంటున్న వారి కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, సోమవారం రాత్రి దుబాయ్ ఎయిర్పోర్టును పునరుద్ధరించారు. భారత్కు వెళ్లే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై విమానాలు టేకాఫ్ అయ్యాయి. హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా ఫ్లైట్ను రద్దు చేసింది. గత ఏడాది శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 5,23,107 మంది గల్ఫ్ కు ప్రయాణించారు.
ఇందులో 50-60 శాతం మంది టూరిస్టులే ఉన్నారు. ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రతీ రోజు 5-6 విమానాలు నేరుగా వెళుతుండగా 15 వరకు కనెక్టింగ్ విమానాలున్నాయి. రోజుకు సగటున 1400-1500 మంది వెళ్తుంటారు. గల్ఫ్లో యుద్ధం జరుగుతుండడంతో దుబాయికి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
దుబాయితోపాటు ఇతర దేశాల ప్రయాణాలకు కూడా ఎవరూ ఇష్టపడడంలేదని వారు పేర్కొంటున్నారు. మార్చిలో ప్రయాణించేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధ భయంతో అక్కడికి వెళ్లలేమని చెబుతూ డబ్బులు రీఫండ్ చేయాలని ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో నిర్వాహకులు కొందరికి సర్దిచెబుతూ వారు కోరిన విధంగా ఇతర తేదీల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. మరికొందరికి డబ్బులను రీఫండ్ చేస్తున్నారు.
