వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన హిందూ మతంపై కుట్ర జరుగుతోందని, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నించే వారికి తగిన గుణపాఠం చెబుదామంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఐతే ఈ ట్వీట్ ఆయన జగన్ టార్గెట్గానే చేశారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
విజయసాయి రెడ్డి ట్వీట్ ఇదే – హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి .. అదే భారతదేశానికి రక్ష … శ్రీరామ రక్ష. అంటూ యూ ట్యూబ్ ఓ వీడియోను సైతం విజయసాయిరెడ్డి ట్వీట్కు అటాచ్ చేశారు.
ముఖ్యంగా, వైసీపీ హయాంలో ఏపీలో ఉద్యమం తరహాలో మత మార్పిళ్లు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షలాది మందిని మతం మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకు సంబంధించి కొన్ని మిషనరీల బృందాలు ఏపీలోని మారుమూల పల్లెల్లోనూ పర్యటనలు చేశాయి. ఐతే కొన్ని గ్రామాల్లో ఈ బృందాలకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికులు ఎదురుతిరిగిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మతం మార్చుకున్నవారు జగన్కు ఓటు బ్యాంకుగా మారతారని ఆ టైంలో నమ్మారు.
ఇక, ఇటీవల విడుదలైన ఓ నివేదికలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా అత్యధిక చర్చిలున్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు, తెలంగాణ తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో చర్చిలు పెరగడానికి కారణం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తరహా నేతలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
నిజానికి, విజయసాయిరెడ్డి కోరినట్లు మత మార్పిళ్లపై కమిటీ వేసి విచారణ జరిపితే…షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్.హాయాంలోనూ భారీగా మత మార్పిడులు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. బ్రదర్ అనిల్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయని అప్పట్లో హిందూ సంఘాలు విమర్శించాయి. జగన్ హయాంలో మత మార్పిడి సంస్థలు పెద్ద ఎత్తున చెలరేగిపోయాయి. పేదలకు డబ్బు ఆశ చూపి మత మార్చేస్తున్నారు.
విజయసాయి ట్వీట్పై మరో చర్చ కూడా జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హిందుత్వం, జాతీయతకు సంబంధించిన ట్వీట్స్ ఎక్కువగా వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
