వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏదీ కలిసి రావడం లేదు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఎలాంటి ప్రభావం చూపించలేక పోతున్నాయి. జగన్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడైతే.. అసలు అసెంబ్లీకే వెళ్లకుండా ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు, కరెంటు పోతుంది, రేడియేషన్ వస్తుందంటూ చేసిన విష ప్రచారానికి జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ దెబ్బతో గూగుల్ డేటా సెంటర్తో పాటు తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ఘనత అంతా జగన్ ఖాతాలో వేసి క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నించారు.
కానీ ఈ ప్లాన్ కూడా రివర్స్ ఫలితాలే ఇచ్చింది. జగన్ హయాంలో పరిశ్రమలను ఏ విధంగా వెంటాడి, వేధించి తరిమేశారో మరోసారి గుర్తు చేయడానికే వైసీపీ క్రెడిట్ చోరీ ప్రచారం పనికొచ్చింది.
పెళ్లిళ్లు, పరామర్శల పేరుతో జనంలోకి వెళ్లినా.. జగన్కి అది మైనస్సే గానీ ప్లస్ అవడం లేదు. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ చేసి.. ప్రజలను గంటల తరబడి ఎండల్లో రోడ్ల మీద నిలబెట్టి.. సామాన్యులను ఇబ్బంది పెట్టిన నాయకుడిగా మిగిలిపోతున్నారు.
ఇక ఈ రోడ్ షోల్లో… మళ్లీ మేమొస్తే.. రప్పా రప్పా వేసేస్తాం.. అనే డైలాగులూ మెజారిటీ ప్రజలకు నచ్చడం లేదు. ఘోరంగా ఓడిపోయిన జగన్.. దారుణంగా బెదిరిస్తుంటే.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి పార్టీల నాయకుల మీద చేసే తప్పుడు ప్రచారాలు.. అసభ్య, అశ్లీల, బూతు దాడులు కూడా వైసీపీ మీద వ్యతిరేకత పెంచతున్నాయే తప్ప.. జగన్కి ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు.
రాజధానిపై మరోసారి విషం కక్కడంతో.. ఆ ప్రాంతంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద జగన్ ఎన్ని ఎత్తులు వేసినా.. అవన్నీ రాంగ్ స్టెప్స్ అవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. వైసీపీ పెద్దలు… ప్రజలను ప్రభావితం చేస్తున్నామనే భ్రమల్లో ఉంటూ.. తమను తాము మోసం చేసుకొంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
