26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

విజయవాడ లాకప్ డెత్ పై హక్కుల సంఘం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ కస్టడీ మరణం (లాకప్ డెత్) వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. ఏపీ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘోర కస్టడీ హింస, జీవించే హక్కుపై జరిగిన దాడిగా NHRC అభివర్ణించింది. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారంటూ మండిపడింది.

ఈ ఉదంతంలో పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత భయానకంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాకప్ డెత్ జరిగిన విషయాన్ని దాచిపెట్టేందుకు పోలీసులు సదరు యువకుడి శవాన్ని కాల్చేసి, ఆ బూడిదను నదిలో కలిపేసి ఆధారాలను ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా, బాధితుడి మరణానికి ముందు కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) నాగరాజు “నీ కొడుకుకు దండ కొనుక్కో” అంటూ మాట్లాడిన భయానక మాటలను బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మి గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏపీ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించింది.

ఈ ఘోరానికి సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు కావాలనే డిలీట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రత్యేక విచారణ బృందం (SIT) జరిపిన ప్రాథమిక విచారణలో విజయవాడలో అక్రమ నిర్బంధం, ప్రాణాంతక హింస నిజమేనని తేలింది. దీనితో కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఈ దారుణ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌లకు అత్యవసరంగా వారం రోజుల గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని తక్షణమే రికవర్ చేయాలని, నదిలో కలిపేసిన బాధితుడి అస్థికలను వెలికితీయాలని ఆదేశించింది. అలాగే బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణ రక్షణ, భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ స్టేటస్, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారంతో కూడిన సమగ్ర ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ATR)ను వారం రోజుల్లోగా సమర్పించాలని ఏపీ పోలీస్ బాసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ అల్టిమేటం జారీ చేసింది.

Related posts

సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!!

Satyam News

లండన్ లో ఎండల తీవ్రత: అల్లాడిపోతున్న జనం

Satyam News

ముచ్చింతల్‌లో సమతా మూర్తిని దర్శించుకున్న సుమ

Satyam News

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News

సవరించిన జీవో ప్రకారం కొత్త అక్రెడిటేషన్ లు

Satyam News

Leave a Comment