స్పేస్ టెక్నాలజీలో ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కూటమి సర్కారు.. తాజాగా రాకెట్ లాంఛింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అంతరిక్ష ప్రయోగ కేంద్రం గురించి ప్రకటన చేశారు. కాకినాడ తీరానికి సమీపంలోని హోప్ ఐలాండ్ నుంచి రాకెట్లు, ఉపగ్రహాల ప్రయోగ కేంద్రం రాబోతోందని తెలిపారు.
ప్రస్తుతం మన దేశానికి చెందిన రాకెట్లు, ఉపగ్రహాలను శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ స్టేషన్ నుంచి అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇక్కడికి సమీపంలో.. తిరుపతి జిల్లా రౌతసురమాల ప్రాంతంలో స్పేస్ సిటీ నిర్మాణం జరుగుతోంది. ప్రైవేటు రాకెట్లు, ఉపగ్రహాలకు సంబంధించిన టెక్నాలజీని స్పేస్ సిటీలో అభివృద్ధి చేస్తారు. ఇక్కడ డెవలప్ చేసిన రాకెట్లను ప్రయోగించడానికి.. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్లో రాకెట్ లాంఛింగ్ స్టేషన్ నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన.
గోదావరి నది నుంచి కొట్టుకొచ్చిన మట్టి.. శతాబ్దాలుగా మేట వేయడంతో.. కాకినాడ తీరంలోని సముద్రంలో హోప్ ఐలాండ్ ఏర్పడింది. 18 కిలోమీటర్ల పొడవైన ఈ దీవిలో ప్రస్తుతం మత్యకారులు నివశిస్తున్నారు. తుఫానులు, సునామీలు వంటి ప్రకృతి వైపరిత్యా నుంచి తీర ప్రాంతాన్ని రక్షించే సహజ సిద్ధమైన రక్షణ గోడలా హోప్ ఐలాండ్ ఉంది. ఇక్కడ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటైతే.. కాకినాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీగా ఉన్న కాకినాడ.. భవిష్యత్తులో రాకెట్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ సెంటర్గా మారిపోతుంది. అమెరికాలో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్.. అక్కడి ప్రభుత్వ రంగ సంస్థ నాసా కంటే మెరుగైన రాకెట్లు తయారు చేసి రికార్డు సృష్టించింది. అదే విధంగా ఏపీలో నిర్మిస్తున్న స్పేస్ సిటీ.. హోప్ ఐలాండ్లో రాబోయే రాకెట్ లాంచింగ్ స్టేషన్.. ప్రభుత్వ రంగ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
