కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అన్నారు.
ఆదివారం సాయంత్రం ఎం టి ఎం సీ పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో రైతు సంఘం, సిఐటియు నాయకులు కరపత్రాల పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక 15 సంవత్సరాల కాలంలో రైతాంగ వ్యతిరేకి విధానాలను తీసుకువచ్చిందని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులను మోసం చేస్తుందని ఆయన అన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం చేస్తూ, వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు.
సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, రైతులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు గుంటూరులో జరిగే సెమినార్లో రైతాంగ సమస్యలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేసేందుకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటు పరం చేసే మోడీ విధానాలను సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు కార్మికులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
కార్మికులు పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, నాలుగు లేబర్ కోడ్లుగా మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు.
గుంటూరులో జరుగు రైతాంగ సెమినార్ను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ గన్, గుడిసె ప్రభుదాస్, బుజ్జి, రామాంజనేయులు, వి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
