భైంసా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలపై ఇటీవల కొంతమంది విద్యార్థి సంఘాల పేరుతో అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించి, యాజమాన్యాలను బెదిరించడం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ముందు అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరగడం పట్ల తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) భైంసా పట్టణ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ నెల 11వ తేదీన భైంసాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలోకి కొంతమంది ఏబీవీపీ నాయకులు అక్రమంగా చొరబడి, పాఠశాల యాజమాన్యంతో అనుచితంగా మాట్లాడి, బెదిరింపులకు పాల్పడిన ఘటనను అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొంది విద్యా సేవలు అందిస్తున్నాయని, పాఠశాలలపై ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే నేరుగా విద్యాశాఖ అధికారులకు గానీ, సంబంధిత అధికారులకు గానీ చట్టబద్ధమైన మార్గంలో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది.
అలా కాకుండా పాఠశాలల్లోకి అక్రమంగా ప్రవేశించి భయాందోళన వాతావరణం సృష్టించడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. ఇలాంటి అరాచక చర్యల వల్ల విద్యార్థుల చదువుకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాసంస్థల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎవరికీ తగదని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఏబీవీపీ నాయకుడిగా పిలువబడే గంగాప్రసాద్పై స్థానిక భైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ఎంఏ ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
భైంసా పోలీసు శాఖ వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పాఠశాలల్లో శాంతిభద్రతలు కాపాడేలా తగిన రక్షణ కల్పించాలని టీఆర్ఎస్ఎంఏ భైంసా కమిటీ విజ్ఞప్తి చేసింది. విద్యా సంస్థల గౌరవాన్ని, విద్యార్థుల భద్రతను మరియు ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత అని అసోసియేషన్ స్పష్టం చేసింది.
