రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాసాంధ్రులు (ఎన్ఆర్ఐలు) అపూర్వ, ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని సింగపూర్లోని తెలుగు కుటుంబాలు భారీ సంఖ్యలో తరలివచ్చాయి. తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన తెలుగు వారు చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందిస్తూ, నినాదాలతో ఘనంగా స్వాగతించారు. ఎంతో కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడిని సింగపూర్ వేదికగా కలుసుకోవడం పట్ల అక్కడి తెలుగు సమాజం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
ఎయిర్పోర్ట్లో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రవాసాంధ్రుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దలు, పిల్లలతో నవ్వుతూ ముచ్చటించిన ఆయన, వారందరితో కలిసి ఎంతో ఓపికగా ఫోటోలు దిగారు. సీఎం చంద్రబాబు చూపిన ఆప్యాయత, చొరవ అక్కడి తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్కు చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ కానుంది.
