ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు,శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండిత ఉవాచ.
పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది.

ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు.దేవస్థానం స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు.
ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్ శ్రీ అమ్మవారి గుడి,కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరిప్రదక్షిణ కొనసాగింది.
శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లోస్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ, ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుండి అందజేయడమైనది.
వేలాది మంది భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, ధర్మ కర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
