ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీలు చేసి పరిపాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసింది.
ప్రధాన నియామకాల విషయానికి వస్తే షంషేర్ సింగ్ రావత్ ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యాటక & సాంస్కృతిక శాఖ)గా నియమించారు. అదనంగా యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, సర్వీసెస్ & హెచ్ఆర్ఎం, జీపీఎం & ఏఆర్ శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. జె. శ్యామలరావును ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖగా నియమించారు. అదనంగా ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ, రాజకీయ శాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు.
కోన శశిధర్ ను రవాణా, రోడ్లు & భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్మెంట్ శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. అమ్రపాలి కాటాను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి, తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
పట్టన్శెట్టి రవి సుబాష్ ను APTDC మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. అలాగే ఏపీ టూరిజం అథారిటీ (APTA) సీఈఓ, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు. ఎస్. సురేష్ కుమార్ ను రానున్న గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియమించారు. డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను గోదావరి పుష్కరాల సంయుక్త ప్రత్యేక అధికారిగా నియమించారు. ముత్యాలరాజు రేవును పురావస్తు & మ్యూజియంల కమిషనర్ గా నియమించారు.
కేవీఎన్ చక్రధర బాబుకు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెఫ్సిబా రాణి కొర్లపాటిను హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
పి. అరుణ్ బాబును డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ గా నియమించారు. ప్రఖర్ జైన్ ను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) మెట్రోపాలిటన్ కమిషనర్ గా నియమించారు. గీతాంజలి శర్మకు ఆర్టీజీఎస్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
చేతన్ టి.ఎస్. కు డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు బాధ్యతలు ఇచ్చారు. డాక్టర్ ఏ. శరత్ (రిటైర్డ్)ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు. ప్రభల గోపీనాథ్ ను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)గా నియమించారు. ఏ.ఏ.ఎల్. పద్మావతిను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓగా నియమించారు.
ఎం. జయకృష్ణను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమించారు. బి. సునీల్ కుమార్ రెడ్డి (ఐఎఫ్ఎస్)కు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
బి. అనిల్ కుమార్ రెడ్డి, ఎన్. తేజ్ భరత్ లను తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ భారీ పరిపాలనా మార్పులతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు మరింత వేగవంతం కావడంతో పాటు శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
