దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. పలుచోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాలు నిలిచిపోయి, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి-బదర్పూర్ (MB) రోడ్, మహిపాల్పూర్, మింటో రోడ్, ఐటీఓ, శకర్పూర్, ఛత్తర్పూర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా వాయుసేన స్థావరం సమీపంలోని MB రోడ్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు నిలవడంతో ఆ ప్రాంతం నదిని తలపించింది. ఖాన్పూర్ నుంచి ఓఖ్లా మోర్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సంగం విహార్, డియోలి, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలిచింది.
వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డ పిల్లలు
ఫతేపూర్ బేరీలోని వాల్మీకి బస్తీలో నడుము లోతు వరకు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులను పెద్ద ప్లాస్టిక్ షీట్ను తాత్కాలిక పడవలా ఉపయోగించి స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆహార నిల్వలు, గృహోపకరణాలు దెబ్బతిన్నాయని బాధితులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా కనీసం 67 ఫిర్యాదులు అధికారులకు అందాయి. వీటిలో నీటిమునక, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరా అంతరాయం వంటి ఘటనలు ఉన్నాయి. ఎర్రకోట పరిసరాలు, ఛత్తర్పూర్ ఫామ్లు, టెర్మినల్-1 సమీపంలోని మెహ్రామ్ నగర్, సైనిక్ ఫార్మ్స్ తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
మహిపాల్పూర్ టీ-పాయింట్ వద్ద నీరు నిలిచిపోవడంతో విమానాశ్రయం, గురుగ్రామ్, వసంత్ విహార్ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పూసా రోడ్ రౌండబౌట్ వద్ద కూడా ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది. ఛత్తర్పూర్ ప్రాంతంలో విద్యార్థులు మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తూర్పు ఢిల్లీలోని శకర్పూర్, మండావలి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, గుంతలు కనిపించకపోవడంతో అనేక ప్రమాదాలు జరిగాయని ఈ-రిక్షా డ్రైవర్లు తెలిపారు. వర్షపు నీరు బ్యాటరీల్లోకి చేరడంతో తమ ఆదాయం తీవ్రంగా పడిపోయిందని, లిథియం బ్యాటరీ దెబ్బతింటే రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు నష్టం వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాల్వలు కబళించిన ఫార్మ్హౌస్ యజమానులు
ఫతేపూర్ బేరీ నివాసితులు ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ కాలువ ఉన్నప్పటికీ, ముందుభాగంలో ఫార్మ్హౌస్ యజమానులు దానిని అడ్డుకోవడంతో ప్రతి వర్షాకాలంలో గ్రామం మునిగిపోతుందని ఆరోపించారు. కొన్నిచోట్ల ఐదు అడుగుల మేర నీరు నిలిచి ఇళ్లలోకి చేరిందని తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ప్రకారం కేశవ్పురం, సౌత్, సెంట్రల్, వెస్ట్, సివిల్ లైన్స్ జోన్లలో చెట్లు కూలిన ఘటనలు నమోదయ్యాయి. NDMC పరిధిలో 34 ఫిర్యాదులు అందగా, వాటిలో 15 నీటిమునక, ఐదు చెట్లు కూలడం, 14 విద్యుత్ అంతరాయాలకు సంబంధించినవే. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)కు 22 నీటిమునక ఫిర్యాదులు వచ్చాయి.
లోధీ రోడ్, సునెహరి బాగ్ రోడ్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్, మింటో రోడ్ బ్రిడ్జ్, రాజీవ్ చౌక్ మెట్రో, సఫ్దర్జంగ్ ఫ్లైఓవర్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, మోతి బాగ్, టాకటోరా గార్డెన్, రేస్ కోర్స్ రోడ్, సరోజినీ నగర్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.
పూడిక తీయించలేకపోయిన ప్రభుత్వం
ఈ పరిస్థితిపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు ముకేష్ శర్మ మాట్లాడుతూ కాలువల శుభ్రపరిచే పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, కేంద్రం-ఢిల్లీ ప్రభుత్వం-ఎంసీడీతో కూడిన “ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం” నీటిమునకను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా బీజేపీపై విమర్శలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలపై రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించలేదు.
ఐఎండీ ప్రకారం రానున్న గంటల్లో ఢిల్లీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్ప విహార్లో అత్యధికంగా 111.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతరం ఛత్తర్పూర్ (104.5 మి.మీ.), అయానగర్ (87.4), పాలం (73.5), జనక్పురి (68), ఝరోడా కలాన్ (67), పూసా (59.5), సఫ్దర్జంగ్ (57.3), నారాయణ (53), రిడ్జ్ (49.6), లోధీ రోడ్ (49.3), మయూర్ విహార్ (36), నజఫ్గఢ్ (24), జాఫర్పూర్ (13.5) మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఐఎండీ గణాంకాల ప్రకారం ఆగస్టు తొలి వారంలోనే ఢిల్లీలో మొత్తం 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2011 తర్వాత ఆగస్టు మొదటి వారంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు వెల్లడించారు.
