గతంలో సంచలనాత్మక జర్నలిస్టుగా పేరు పొందిన తరుణ్ తేజ్ పాల్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. 2013లో జరిగిన అత్యాచార కేసులో అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసులో 2021లో గోవా ట్రయల్ కోర్టు తరుణ్ తేజ్ పాల్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు తరుణ్ తేజ్ పాల్ దోషి అని తేల్చింది. విచారణలో ట్రయల్ కోర్టు సాక్ష్యాధారాలను సక్రమంగా పరిశీలించలేదని, చట్టపరమైన అంశాలను సరైన రీతిలో అన్వయించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు 2013 నవంబర్లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా వెలుగులోకి వచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో తరుణ్ తేజ్పాల్పై కేసు నమోదైంది. బాధితురాలు తనపై జరిగిన ఘటనను సంస్థ యాజమాన్యానికి తెలియజేయడంతో విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం గోవా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీర్ఘకాల విచారణ అనంతరం 2021లో గోవా అదనపు సెషన్స్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలి వాంగ్మూలంలో వ్యత్యాసాలు ఉన్నాయని, అభియోగాలను సందేహాతీతంగా నిరూపించలేకపోయారని ట్రయల్ కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
విచారణ అనంతరం బాంబే హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును పూర్తిగా పక్కనబెట్టి, అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం, కేసు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాత తేజ్పాల్ను దోషిగా నిర్ధారించింది. ట్రయల్ కోర్టు కొన్ని కీలక అంశాలను విస్మరించిందని, బాధితురాలి వ్యక్తిగత జీవితంపై అనవసరమైన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చిందని హైకోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం.
తేజ్పాల్కు విధించాల్సిన శిక్షపై తదుపరి విచారణలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ తీర్పు దేశంలో లైంగిక నేరాల విచారణ, బాధితుల వాంగ్మూలాల విలువ, న్యాయస్థానాల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.
