ప్రపంచంహోమ్

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

#StraitOfHormoz

ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడికి వెళ్లకుండా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు.

దాంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌తో త్వరితగతిన ఒప్పందం కుదిరి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందనే ఆశలు పెరగడంతో సోమవారం ముడి చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 4.49 డాలర్లు లేదా 5.11 శాతం పడిపోయి 83.44 డాలర్లకు చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ బ్యారెల్‌కు 4.90 డాలర్లు లేదా 5.79 శాతం తగ్గి 79.77 డాలర్ల వద్ద ట్రేడైంది.

గత నెలలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం, ఒమన్ తీర ప్రాంతంలో పలు చమురు ట్యాంకర్లపై దాడులు జరగడం, హోర్ముజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు దిగజారడంతో చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ప్రభావంతో గత నెలలో బ్రెంట్, WTI చమురు ధరలు 20 శాతానికి పైగా ఎగసిపడ్డాయి. గల్ఫ్ ప్రాంతంలో చమురు లోడింగ్‌కు వెళ్లేందుకు అనేక నౌకాయాన సంస్థలు వెనుకంజ వేయడంతో సరఫరా అంతరాయం ఏర్పడుతుందనే భయం మార్కెట్లను ప్రభావితం చేసింది.

అయితే శనివారం రాత్రి ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన ప్రకటనతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ఇరాన్‌తో పాటు మధ్యప్రాచ్య దేశాలు ఒప్పందాన్ని పూర్తి చేసుకునేందుకు కొంత సమయం కోరాయని, ఆ ఒప్పందం ద్వారా హోర్ముజ్ జలసంధి తక్షణమే, పూర్తిస్థాయిలో తిరిగి తెరుచుకోవడంతో పాటు ఇరాన్ అణు ముప్పుకు కూడా ముగింపు పలికే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలు బలపడ్డాయి.

అయితే మార్కెట్ విశ్లేషకులు ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. ఐజీ మార్కెట్ విశ్లేషకుడు టోనీ సైకమోర్ అభిప్రాయం ప్రకారం, గత వారం మాదిరిగానే ఈ వారం కూడా చర్చలపై ఆశలు రేకెత్తి, తర్వాత ఇరాన్ తన వైఖరిని కఠినతరం చేస్తే పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకునేందుకు అమెరికా సైనిక స్థావరాలపై లేదా అక్కడి మీదుగా ప్రయాణించే చమురు ట్యాంకర్లపై దాడులకు పాల్పడే అవకాశం ఉంటే మార్కెట్లలో మళ్లీ అనిశ్చితి నెలకొనవచ్చని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, వారాంతంలో సౌదీ అరేబియా నుంచి చమురుతో బయలుదేరిన రెండు ట్యాంకర్లు ఎర్ర సముద్రం నుంచి బాబ్-ఎల్-మండెబ్ జలసంధిని విజయవంతంగా దాటినట్లు నౌకాయాన గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడుల వార్తల నేపథ్యంలో అక్కడ నౌకల రాకపోకలు మాత్రం మందగించినట్లు సమాచారం.

యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ శనివారం నుంచి ఇప్పటివరకు మరో మూడు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు వెల్లడించింది. దీంతో సముద్ర మార్గాల భద్రతపై ఆందోళనలు పూర్తిగా తగ్గలేదని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు చమురు ఉత్పత్తిదారుల కూటమి ఓపెక్ ప్లస్ ఆదివారం సమావేశంలో సెప్టెంబర్ నెల నుంచి రోజుకు సుమారు 1.88 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి కోటాను పెంచేందుకు ఆమోదం తెలిపింది. గతంలో స్వచ్ఛందంగా అమలు చేసిన ఉత్పత్తి కోతలను దశలవారీగా ఎత్తివేసే ప్రక్రియలో ఇది చివరి కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

అయితే ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గల్ఫ్ ప్రాంతం, రష్యా, కజకిస్థాన్ నుంచి ఎగుమతులు అంతరాయం కలుగుతున్నందున ఈ ఏడాది వరుసగా ప్రకటించిన ఓపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపులు వాస్తవ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు చెబుతున్నారు. సరఫరా అంతరాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంపు నిర్ణయాల ప్రయోజనం పరిమితంగానే ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related posts

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

Satyam News

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

Satyam News

లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

Satyam News

పెంచలయ్య కుటుంబానికి అండగా కోటంరెడ్డి

Satyam News

సంఘ్ శ‌తాబ్ది ఉత్స‌వ వేళ‌ గణవేష్ అభియాన్

Satyam News

ఆందోళనలతో అల్లకల్లోలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్

Satyam News

Leave a Comment