‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది గానీ, వారికి సరిపడ రోడ్డు సౌకర్యం మెరుగుపడడం లేదన్న అంశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది.
క్షేత్ర స్థాయి పర్యటనల్లో అలాంటి ఎన్నో ఆలయాలు ఆయన కంట పడ్డాయి. కొన్ని ఆలయాల దుస్థితిని ప్రజలు వినతపత్రాల రూపంలో పవన్ కళ్యాణ్ కి అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో దేవుని దర్శనానికి వెళ్లే దారి లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 100కు పైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల పొడుగున రోడ్లతో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.
శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన గుడి బాట పనులు అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారుల్లో 26 నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకి సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. అందులో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూలన ఉన్న ఆలయాలు దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి.
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ. 3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు తెనాలి, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్లు, నిడదవోలులో ఆంజనేయస్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గం తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయం తదితర రహదారుల పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్లు సైతం వివిధ దశల్లో సనులు కొనసాగుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మించే రోడ్లు భక్తులకు సుదీర్ఘ కాలం ఉపయోగపడాలని సూచనలు చేశారు.
క్షేత్ర స్థాయి పర్యటనల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాల రోడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులకి తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ నాయకత్వలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
