తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన సమయంలో బాధ్యతా రహిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన విమర్శించారు.
తెలంగాణ లో తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చూపిన రోజుల్లో కూడా ప్రకృతి వైపరీత్యంగా భావించామే తప్ప ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడూ నిందించలేదని ఆయన స్పష్టం చేశారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరితోటలు ఎండిపోతే దానికి తెలంగాణ ప్రజల ‘దిష్టి’ కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అవివేకంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
ఇలాంటి మాటలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసరమైన విభేదాలు రేపే ప్రమాదం ఉందని తెలిపారు. తెలంగాణలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ నాయకత్వం కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బతీసేలా కూటమిపక్ష నాయకుడు మాట్లాడడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వల్ల ఇబ్బందులు వచ్చినప్పుడు మా హుస్నాబాద్ మునిగిపోయినప్పటికీ ఆ ప్రాంత ప్రజలను ఎప్పుడూ నిందించలేదని మంత్రి గుర్తుచేశారు.
ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకో, దురదృష్టానికో అన్వయించడం ప్రజలకు అవమానకరమని పుణ్యమాని అన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ప్రజలతో క్షమాపణలు కోరాలని మంత్రి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
రెండు రాష్ట్రాలు కలిసి దేశ అభివృద్ధిలో ముందుకు సాగాలి గానీ విభేదాలకు కారణమయ్యే వ్యాఖ్యలు నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
