ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మరో ప్రతిష్టాత్మక పర్యటన కోసం డిసెంబర్ 6న అమెరికాకు వెళ్లనున్నారు. గత పర్యటనల్లో ఏపీకి గూగుల్ డేటా సెంటర్,ఇన్ఫోసిస్ లాంటి అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చిన లోకేష్ పై ఈ సారి అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక, ఈ పర్యటనలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.
లోకేష్ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం –
లోకేష్ ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలకు స్వయంగా వివరించనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో టెక్నాలజీ హబ్ అయిన శాన్ ఫ్రాన్సిస్కోల ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈఓలు, ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశమవుతారు. ఈ భేటీల్లో, ఏపీలో ఉన్న మానవ వనరుల లభ్యత, పారదర్శకమైన విధానాలు, వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్సులు లాంటి అంశాల గురించి ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది.
గతంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో లోకేష్ చూపిన చొరవ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ కారణంగా, ప్రస్తుత పర్యటనపై అంచనాలు మరింత పెరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ, స్టార్టప్ కేంద్రంగా ఉండటంతో, మంత్రి లోకేష్ ఈసారి టెక్ ప్రపంచంలోని ఏ మేజర్ కంపెనీని ఏపీకి తీసుకువస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
మొత్తంగా, మంత్రి నారా లోకేష్ చేపట్టనున్న ఈ అమెరికా పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. లోకేష్ విదేశీ పర్యటన ఏపీకి కేవలం పెట్టుబడులనే కాకుండా, ప్రపంచ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ను మరింత పెంచడంలో సహాయపడుతుంది. డిసెంబర్ నెలలో వెలువడనున్న అధికారిక ప్రకటనల కోసం రాష్ట్ర యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
