వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED అరెస్టు చేసింది. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని APSBCL మద్యం రవాణా సబ్కాంట్రాక్టును తన కుమారుడు కారుమూరి సునీల్కు దక్కేలా చేసి, ఈ దోపిడీలో ఆయన కీలక కుట్రదారుగా వ్యవహరించారని ED దర్యాప్తులో నిర్ధారించింది. ఈ కేసులో కారుమూరి అరెస్టుతో మొత్తం నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.
మద్యం సరఫరా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారాలను జిల్లా స్థాయి కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయికి మార్చి, తమకు అనుకూలంగా ఉన్న సిగ్మా సంస్థకు కట్టబెట్టారు. కిలోమీటరుకు రూ. 19.68గా ఉన్న రవాణా ఛార్జీని ఏకంగా రూ. 32.53కు పెంచి లబ్ధి పొందారు. ఈ క్రమంలో సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ముసుగు సంస్థ ద్వారా సబ్కాంట్రాక్టు కుదుర్చుకుని, కొల్లగొట్టిన సొత్తులో 85% మొత్తాన్ని హవాలా మార్గాల్లో కారుమూరి కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి మళ్లించారు.
ఈ దోపిడీ సొమ్మునే విజయవాడ, తణుకుల్లోని కారుమూరి క్యాంపు కార్యాలయాల నిర్వహణకు, వ్యక్తిగత వాహనాల డీజిల్, ప్రయాణ ఖర్చులకు వెచ్చించినట్లు ED తేల్చింది. మొత్తం రూ. 68 కోట్ల లావాదేవీల్లో ఇప్పటివరకు రూ. 15 కోట్ల మూలాలను గుర్తించారు. కారుమూరి నివాసంలో జరిపిన సోదాల్లో లభించిన హవాలా లావాదేవీల నోటు ముక్క, సునీల్ సృష్టించిన పాత తేదీల నకిలీ ఒప్పంద పత్రాలు ఈ కేసులో సంచలన ఆధారాలుగా మారాయి.
మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన అక్రమ సొత్తుతో కొనుగోలు చేసిన సుమారు రూ. 37.7 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ED ఇప్పటికే జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో హైదరాబాద్లోని కోకాపేట, ఖాజాగూడ ప్రాపర్టీలు, అనకాపల్లిలోని గ్రానైట్ క్వారీ లీజు హక్కులు, దిల్లీ, గురుగ్రామ్లలోని కమర్షియల్ యూనిట్లు, లగ్జరీ వాహనాలు, ఖరీదైన వాచ్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నాటి APSBCL ఎండీ వాసుదేవరెడ్డితో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు వందలాది సార్లు మాట్లాడటమే కాకుండా.. 465 సార్లు ఒకే చోట ఉన్నట్లు టవర్ లొకేషన్లు, CDR డేటా ద్వారా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మూలాల ఆధారంగా హవాలా నెట్వర్క్లోని ఇతర పాత్రధారులపై ED దర్యాప్తు వేగవంతం చేసింది.
