నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈనెల 29న గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనగర్లోని TSR TBK కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
చదువుకున్న యువత తమ అర్హతలకు తగిన ఉద్యోగాలను సాధించేందుకు జాబ్ మేళా మంచి అవకాశంగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. యువత తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈనెల 29న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు దాదాపు 10 వేల మంది యువత హాజరయ్యే అవకాశం ఉందని పల్లా శ్రీనివాసరావు అంచనా వేశారు. వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేలా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాబ్ మేళా ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, ఇతర పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో హాజరై తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని నాయకులు సూచించారు.
