ప్రపంచంహోమ్

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

#DonaldTrump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అణు పరీక్షల అంశం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ సహా అనేక దేశాలు అణు ఆయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ నేపథ్యంలో అమెరికా కూడా తన అణు పరీక్షలను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ‘‘రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌ ఇవన్నీ అణు పరీక్షలు చేస్తున్న దేశాలు. కానీ అమెరికా మాత్రం పరీక్షలు చేయడం లేదు. రష్యా పరీక్షలు చేస్తుంది, చైనా కూడా చేస్తుంది, కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. మనం ఓపెన్‌ సొసైటీ. మనం మాట్లాడుతాం.

ఎందుకంటే మీరు (మీడియా) రాయబోతారు,’’ అని అన్నారు. అణు పరీక్షలపై తన నిర్ణయాన్ని వివరించమని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘‘రష్యా తాజాగా పరీక్షలు చేస్తుందని ప్రకటించింది. ఉత్తర కొరియా ఎప్పుడూ పరీక్షలే చేస్తోంది. ఇతర దేశాలు కూడా అదే చేస్తున్నారు. మనం మాత్రమే చేయడం లేదు. అలా ఎందుకు ఉండాలి? కాబట్టి మనమూ పరీక్షలు చేస్తాం,’’ అని స్పష్టం చేశారు.

మూడున్నర దశాబ్దాల తర్వాత అమెరికా అణు ఆయుధాలను మళ్లీ పేల్చేందుకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. రష్యా పోసైడాన్‌ అండర్‌వాటర్‌ డ్రోన్‌ వంటి ఆధునిక అణు వ్యవస్థలను పరీక్షించగా, అమెరికా కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ‘‘ అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే పరీక్షించాల్సిందే,’’ అని అన్నారు.

తన వద్ద రష్యా, చైనా నాయకులతో అణు నిరాయుధీకరణ (డీన్యూక్లియరైజేషన్‌) అంశంపై చర్చలు జరిగాయని ట్రంప్‌ వెల్లడించారు. ‘‘మనం ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలిగేంత అణు ఆయుధాలను కలిగి ఉన్నాం. రష్యాకు కూడా చాలా ఉన్నాయి. చైనా కూడా ఎక్కువగా సేకరిస్తోంది,’’ అని ఆయన అన్నారు.

అమెరికా అణు ఆయుధాల పరీక్షలను వెంటనే పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచే పరిణామంగా భావిస్తున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఎక్కే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్‌, ‘‘రష్యా, చైనా అన్ని పరీక్షలు చేస్తున్నాయి. మనం మాత్రమే చేయడం లేదు. ఇప్పుడు మనం కూడా చేయడం సబబు,’’ అని అన్నారు.

అమెరికా అణు పరీక్షల కోసం అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, కానీ ఎక్కడ, ఎప్పుడు పరీక్షలు జరగనున్నాయో వివరించడానికి ఆయన నిరాకరించారు. పునరుద్ధరించిన పరీక్షలు ప్రపంచ అణు సమతుల్యాన్ని అస్థిరం చేస్తాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘మనకు అంతా నియంత్రణలోనే ఉంది,’’ అని సమాధానమిచ్చారు.

ఇక మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికాతో ఉన్న ప్లూటోనియం నిర్వీర్య ఒప్పందాన్ని రద్దు చేసే చట్టంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు సైనిక అవసరాలకు మించి ఉన్న 34 టన్నుల ఆయుధాల స్థాయి ప్లూటోనియంను నిర్వీర్యం చేయాల్సి ఉంది. అయితే, ఆ ఒప్పందం ఇప్పుడే లేనట్టే అయిందని, దానిని అధికారికంగా రద్దు చేసినట్లు పుతిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా–రష్యా–చైనా మధ్య అణు శక్తి పోటీ మళ్లీ వేడెక్కిన సంకేతాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News

మరిడి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Satyam News

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Satyam News

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News

Leave a Comment