శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం జరిగిన చిన్నశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
శ్రీ మలయప్పస్వామివారు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవకు ముందు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమతమ సంప్రదాయ కళారూపాలను భక్తి, సంగీతం, నృత్య సమ్మేళనంతో ప్రదర్శించి భక్తులను పరవశింపజేశారు.
ఈ సందర్భంగా 9 రాష్ట్రాలకు చెందిన 20 కళాబృందాల నుంచి 539 మంది కళాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రాంతాల కళా సంప్రదాయాలను తిరుమలలో ఆవిష్కరించారు.
వైవిధ్యమైన కళారూపాలతో అలరించిన కళాకారులు
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కళాకారులు దేవేరులతో చిన్నశేష వాహనం, భరతనాట్యం, ఒడిశీ, గరగాటం తదితర కళారూపాలను ప్రదర్శించారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు జానపద కళారూపాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కళాబృందాలు ఎదుకుల వైభవం, కోలాటం ప్రదర్శించగా, పుదుచ్చేరి కళాకారులు ఒయ్యిళ్లాట్టంను ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కళాకారులు ప్రదర్శించిన శ్రీమద్రామాయణం భక్తులను విశేషంగా అలరించింది.
మహారాష్ట్ర కళాకారుల దగర్ గాజా, డ్రీమ్స్, అస్సాం కళాకారుల బోర్థాల్, పశ్చిమబెంగాల్ కళాబృందాల ఒడిశీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా బిహు, మంజునాథ చరితం, కాళింగ నర్తన, కోలాటం, తమిళ జానపదం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. కళాకారుల సంప్రదాయ వస్త్రధారణ, మధురమైన సంగీతం, అద్భుతమైన నృత్య విన్యాసాలు తిరుమల వీధులకు కళా శోభను తీసుకొచ్చాయి.
ఒకే వేదికపై భారతీయ సంస్కృతి వైభవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక ప్రదర్శనలు “భిన్నత్వంలో ఏకత్వం” అనే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పాయి. దేశంలోని వివిధ ప్రాంతాల కళా సంప్రదాయాలు తిరుమలలో ఒకే వేదికపై కొలువుదీరడంతో భక్తి, సంగీతం, నృత్యం, జానపద కళల అద్భుత సమ్మేళనం ఆవిష్కృతమైంది. శ్రీవారి దివ్యసన్నిధిలో దేశం నలుమూలల కళా వైభవం వెల్లివిరియడంతో చిన్నశేష వాహనసేవ మరింత శోభాయమానంగా మారింది.
