నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత మహిళా జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. 1983లో కపిల్ దేవ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో వేసిన ఆ చారిత్రాత్మక క్యాచ్తో భారత పురుష జట్టు తొలి వరల్డ్కప్ గెలుచుకున్న జ్ఞాపకాన్ని గుర్తుచేసేలా ఈసారి హర్మన్ప్రీత్ కౌర్ తన అద్భుత క్యాచ్తో భారత మహిళా జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించింది.
దక్షిణాఫ్రికా జట్టు చివరి ఆశగా ఉన్న నడీన్ డి క్లర్క్ కవర్ డ్రైవ్ ఆడబోయి బంతిని గాల్లోకి ఎగరేసింది. ఆ సమయానికి కవర్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ గాల్లోకి ఎగిరి, అద్భుతమైన టైమింగ్తో బంతిని అందుకుని మ్యాచ్ను ముగించింది. ఆ క్షణం DY పాటిల్ స్టేడియంలో ఉన్న లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆ క్యాచ్తో దక్షిణాఫ్రికా జట్టు చివరి బ్యాటర్ ఔటవడంతో భారత జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం రెండు దశాబ్దాలుగా భారత మహిళా క్రికెట్ ఎదురుచూస్తున్న కలను నిజం చేసింది. ఐసీసీ కూడా ఆ క్షణాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసింది. తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “Harmanpreet Kaur 🤝 Kapil Dev — Iconic catches and leading India to a World Cup first 🏆 #CWC25” అంటూ పోస్ట్ చేసింది.
ఈ విజయం భారత మహిళా క్రికెట్కు కొత్త యుగాన్ని తెరలేపింది. 1983 పురుషుల వరల్డ్కప్ భారత్లో క్రికెట్ పట్ల మమకారాన్ని రెట్టింపు చేసినట్లే, 2025 నవంబర్ 2న సాధించిన ఈ విజయం మహిళా క్రికెట్ను దేశవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందేలా చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ చేతుల్లో ఆ క్యాచ్ మాత్రమే కాదు… అది భారత మహిళా క్రికెట్ కలల సాకారం, రెండు దశాబ్దాల ప్రయాణానికి సముచితమైన ముగింపు, ఒక కొత్త ఆరంభం కూడా.
