అమెరికాతో మరో సారి చర్చలు జరిపే ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ తో చర్చలు జరిపేందుకు మరో సారి సిద్ధమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయీ తోసిపుచ్చారు.
చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతూనే మరోవైపు చర్చలు ఉండవని ప్రకటించడం వంటి పరస్పర విరుద్ధ సంకేతాలు ఇస్తున్నారని రెజాయీ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడి భిన్న ప్రకటనలతో ఎవరూ అయోమయానికి గురికావద్దని ఆయన సూచించారు.
చమురు, జలసంధులకు సంబంధించిన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రెజాయీ పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని నియంత్రించే చర్యలతో రాబోయే పరిణామాలను అడ్డుకోలేరని హెచ్చరించారు. ఇరాన్ విధించిన షరతులను అమెరికా అంగీకరించి, వాటిని నెరవేర్చే వరకు ఎలాంటి చర్చలకు అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు, చమురు సరఫరా, కీలక సముద్ర మార్గాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసినట్లు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
