గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త ఆత్మహత్యకు సంబంధించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏటి అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటరమణ దంపతులు. అయితే కుటుంబ జీవనంలో ఏర్పడిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు ఓ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశాడు.
అందులో తన భార్య వెంకటరమణకు లాయర్ బాలాజీతో వివాహేతర సంబంధం ఉందని, విడాకుల కోసం రూ.20 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోందని ఆరోపించాడు. అలాగే తనపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తానని చెప్పి వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నాడు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
