25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

వెనిజులా అధ్యక్షుడి గురించిన ఆసక్తికర సమాచారం ఇది…

#Satyasaibaba

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్టు చేయించిన వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో కు సంబంధించిన అతి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఆంక్షలు, రాజకీయ వివాదాలు మొదలుకాకముందే, ఈ దంపతులు ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబాకు భక్తులుగా మారారు.

క్యాథలిక్ మతంలో పెరిగిన మదురోకు, వివాహానికి ముందు సిలియా ఫ్లోరెస్ ద్వారానే సత్యసాయి బాబా పరిచయం అయ్యారు. 2005లో ఈ జంట ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఆశ్రమానికి వెళ్లి సత్యసాయి బాబాను వ్యక్తిగతంగా దర్శించుకున్నారు.

ఆ సందర్శనకు సంబంధించిన ఫొటోల్లో యువ దంపతులు సాయి బాబా పక్కన కూర్చుని కనిపిస్తారు. తరువాతి సంవత్సరాల్లో మదురో తన భక్తిని బహిరంగంగానే ప్రదర్శించారు. ఆయన వ్యక్తిగత కార్యాలయంలో సైమన్ బొలివర్, హ్యూగో చావెజ్ చిత్రాల పక్కనే సత్యసాయి బాబా చిత్రపటాన్ని కూడా ఉంచారు.

వెనిజులాలో ఇప్పటికీ ఉన్న సత్య సాయి సంస్థ

2011లో సత్యసాయి బాబా మరణించిన తరువాత, అప్పట్లో వెనిజులా విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో, ఆయనను అధికారికంగా గౌరవించే ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. వెనిజులా జాతీయ అసెంబ్లీ సంతాప తీర్మానం ఆమోదించి, మానవాళికి సత్యసాయి బాబా చేసిన “ఆధ్యాత్మిక సేవలను” గుర్తిస్తూ ఒకరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

వెనిజులాలో సత్యసాయి సంస్థ ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది. 1974 నుంచే అక్కడ సాయి భక్తుల సముదాయం ఉంది. ఇది లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. 2024లో వెనిజువెలా జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం ‘ఓం’ చిహ్నాన్ని కూడా చేర్చింది. 2025లో అరెస్టయ్యే కొన్ని నెలల ముందే, సత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని మదురో అధికారిక ప్రకటనలో ఆయనను “ప్రకాశ స్వరూపుడు”గా కొనియాడారు.

1962 నవంబర్ 23న జన్మించిన నికోలాస్ మదురో ఒక కార్మిక వర్గ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి ట్రేడ్ యూనియన్ నాయకుడు. 1992లో హ్యూగో చావెజ్ విఫల తిరుగుబాటు జరిగిన సమయంలో మదురో బస్ డ్రైవర్‌గా పనిచేశారు. ఆ తరువాత చావెజ్ విడుదల కోసం ఉద్యమించి, ఆయన విప్లవాత్మక ఆలోచనలకు మద్దతుగా నిలిచారు.

1998లో చావెజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మదురో రాజకీయాల్లోకి ప్రవేశించి, పార్లమెంట్ సభ్యుడిగా, జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా, తరువాత విదేశాంగ మంత్రిగా ఎదిగారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో వెనిజువెలా సంబంధాలు బలపడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

2013లో హ్యూగో చావెజ్ మరణానంతరం మదురో దేశాధ్యక్షుడయ్యారు. అయితే ఆయన అధ్యక్ష పదవీకాలంలో వెనిజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, రేషన్ క్యూలు వంటి సమస్యలు తలెత్తాయి. ధరలను నియంత్రించేందుకు దుకాణాల నుంచి గృహోపకరణాలను స్వాధీనం చేసుకునేందుకు సైన్యాన్ని పంపడం వంటి వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

2018లో డ్రోన్ల ద్వారా జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేశారు. మదురో రాజకీయ జీవితం మొత్తం ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కీలక పాత్ర పోషించారు. అటార్నీ జనరల్‌, పార్లమెంట్ చీఫ్‌ వంటి అత్యున్నత పదవులు ఆమె నిర్వహించారు.

Related posts

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!

Satyam News

మకరజ్యోతి దర్శనంతో తరించిన భక్తులు

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిన శాంతిభద్రతలు

Satyam News

సమస్యల వలయంలో చిక్కుకున్న ఎయిర్ టెల్

Satyam News

Leave a Comment