అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మంగళగిరి ఎంపీడీవో సుగుణమ్మ అన్నారు. మంగళవారం నగరంలోని గండాలయ పేటలో జరిగిన ఆధార్ అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సుగుణమ్మ మాట్లాడుతూ గండాలయ పేటలోని నిరుపేదలు తమ బ్రతుకుతెరువు నిమిత్తం వలసలు వెళ్లడం కారణంగా ఆధార్ కార్డులు మంజూరు కాలేదేమోనని భావిస్తున్నట్లు తెలిపారు. కూలీ పనులు లేకుండా ఎక్కడా ఎప్పుడూ లేదని, స్థానికంగానే నివాసం ఉంటూ కూలీ పనులకు వెళ్లాలని ఆమె సూచించారు.
మహిళలు గర్భవతులు గా ఉన్నప్పుడే ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తల వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు అవసరం తెలిసి ఉండాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు మంజూరు కావాలంటే ఆధార్ కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.
ఆధార్ కార్డులు లేని వారికి కొత్త ఆధార్ కార్డులు మంజూరు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. భారత్ కేర్ లైఫ్ లైన్ ఫౌండేషన్ డైరెక్టర్ వంశీరెడ్డి మాట్లాడుతూ ఇటీవల భారత్ కేర్స్ లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలోని వీధులు, దేవాలయాల వద్ద సంచరించే యాచకులు, అదేవిధంగా గండాలయ పేటలో ఆధార్ కార్డులు లేని పలువురు పేద ప్రజలను గుర్తించడం జరిగిందన్నారు.
తమ సర్వేలో దాదాపు 132 మందికి ఆధార్ కార్డులు లేవని గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ కనీసం జనన ధ్రువీకరణ పత్రాలు కూడా లేవన్నారు. కావున జనన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిషోర్, భారత్ కేర్ లైఫ్ లైన్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ ఆదామ్ తదితరులు పాల్గొన్నారు.
