తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై బీసీ రాజ్యాధికార సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఆర్టీసీ సేవలను వినియోగించే ప్రయాణికులలో కూడా మెజారిటీగా బీసీ, దళిత వర్గాలే ఉన్నారని సమితి పేర్కొంది.ఈ నేపథ్యంలో, బీసీ రాజ్యాధికార సమితి ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను పంపింది .
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ మాట్లాడుతూ, సమ్మె దీర్ఘకాలం కొనసాగితే ప్రజలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతుందని హెచ్చరించారు. అందువల్ల ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే చర్చలకు ఉపక్రమించి, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు.
ప్రజా రవాణా వ్యవస్థకు మూలస్థంభమైన ఆర్టీసీని బలహీనపరచడం వల్ల సామాన్య ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అదే సమయంలో కార్మికుల హక్కులను నిర్లక్ష్యం చేయడం కూడా సరికాదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి దాసు సురేశ్ కింది డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు:
ఆర్టీసీ ఉద్యోగులతో వెంటనే చర్చలు ప్రారంభించి సమ్మెను శాంతియుతంగా పరిష్కరించాలి
ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పరిగణించాలి
పెండింగ్ వేతనాలు, పీఆర్సీ, భత్యాలను తక్షణమే చెల్లించాలి
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజేషన్ చేపట్టాలి
ప్రైవేటీకరణ చర్యలను పూర్తిగా నిలిపివేయాలి
ప్రజా ప్రయోజనాలు మరియు కార్మిక హక్కులు ప్రభుత్వానికి సమాన ప్రాధాన్యత కలిగినవన్నారు . ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఉద్యోగుల హక్కులను కాపాడే సమతుల్య పరిష్కారం కనుగొనడం ప్రభుత్వ బాధ్యత అని దాసు సురేశ్ పేర్కొన్నారు. సమ్మెను బలహీనపరచడం కాకుండా, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన హితవు పలికారు.
ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన సమ్మెకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని తెలియజేశారు.
