ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు రసాయన ఎరువులకు బదులుగా కంపోస్ట్ వంటి సంప్రదాయ ఎరువుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు.
18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చారు. నేచర్ ఫార్మింగ్లో ఏపీ సాధించిన ప్రగతిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు.
సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్తో సమావేశంలో.. ప్రకృతి సేద్యాన్ని విస్తరించినందుకు ప్రోత్సాహకంగా రావాల్సిన 216 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. దేశ జనాభాలో 4 శాతం.. భూభాగంలో 5 శాతం మాత్రమే ఉన్న ఏపీ.. వ్యవసాయంలో పది శాతం ఉత్పత్తి చేస్తూ.. ఇండియాలోనే టాప్ ప్లేస్లో ఉందని వివరించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
దేశ ఆహార భద్రతకు, ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యానికి ఏపీ రైతులు వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకొనే విషయంపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో కొబ్బరి సాగును ప్రోత్సహించడానికి 200 కోట్లు కేటాయించి.. కోకోనట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు.. నర్సరీల విస్తరణ రైతులకు శిక్షణతో పాటు కర్నాటక తరహాలో కొబ్బరి బొండాల మార్కెట్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో దాదాపు 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని వివరించారు. తామర గింజలు పండించడానికి ఏలూరులో మఖానా బోర్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాయలసీమను హార్టీకర్చలర్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్రం నుంచి సహకారం ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
