రియల్ఎ స్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచంద్రరావు ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూములపై నివసిస్తూ ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను ఆయన పరామర్శించారు.
న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని అన్నారు. బాధితులకు అదే స్థలంలో నివాస స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెలుగుమట్ల ప్రాంతంలోని సర్వే నంబర్లు 147, 148, 149 భూముల్లో గత 15 ఏళ్లుగా దాదాపు 600 పేద కుటుంబాలు నివసిస్తున్నాయని ఆయన తెలిపారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ స్థలం ఏర్పాటు చేసుకుని గుడిసెలు నిర్మించుకున్న నిరుపేదల ఇళ్లను ప్రభుత్వం కనికరం లేకుండా నేలమట్టం చేసిందని విమర్శించారు. ఉన్నత న్యాయస్థానం యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించినప్పటికీ వాటిని ఖాతరు చేయలేదని ఆరోపించారు.
ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనంలో తలదాచుకున్న బాధితులను కూడా ఆయన పరామర్శించారు. జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో భూమి విలువ పెరిగిందని, అధికార వర్గాలకు సన్నిహితులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు భారీ భద్రతా బలగాలతో ఇళ్లను కూల్చివేశారని, గర్భిణీలు, వృద్ధులు, పిల్లలు, విద్యార్థులు అని కూడా చూడలేదని అన్నారు.
పేదలు కష్టపడి సంపాదించుకున్న నిత్యావసర వస్తువులు, ధాన్యం, పిల్లల పుస్తకాలు శిథిలాల కింద కలిసిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అదే స్థలంలో వంద గజాల చొప్పున స్థలాలు కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
