రైతన్నలకు పూర్తిగా రుణమాఫీ చేసి నిరు పేద రైతన్నలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆల్ ఇండియా PHPS ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు.
పేద రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని మన్నెపాకుల మాధవ్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్లు తమ సేవలకు రేట్లు నిర్ణయించుకోవచ్చు, హాస్టల్ యాజమాన్యాలు ఫీజులు నిర్ణయించుకోవచ్చు, కానీ రైతులు పండించిన పంటలకు మాత్రం ఎందుకు తమే ధర నిర్ణయించుకునే హక్కు ఇవ్వడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రైతు భరోసా, పంట నష్టం భీమా వెంటనే మంజూరు చేయాలని, రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకునే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గిట్టుబాటు ధరలు లేక రైతులు పురుగుమందు తాగి, రైళ్ల కింద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని అరికట్టే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. పేద రైతులకు మూడు ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వాలని, సబ్సిడీ ద్వారా ఉచిత బోర్లు వేసి ఆదుకోవాలని కోరారు.
రైతులు పండించిన ధాన్యంతోనే ప్రజలు మూడు పూటలా భోజనం చేస్తున్నారని, అలాంటి రైతుల పంటలను కొట్టే అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
