మూసీ నది పునరుజ్జీవం పేరుతో జరుగుతున్న లూటీకి తాము పూర్తిగా వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీ హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైవ్ స్టార్ హోటల్లో మూసీ బ్యూటిఫికేషన్పై ప్రెజెంటేషన్ ఇస్తున్నారని పేర్కొంటూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధితుల తరఫున కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు. అయితే మాత్రమే తమ పార్టీ వ్యతిరేకమని అన్నారు. సుందరీకరణ పేరుతో వేలాది మందిని నిరాశ్రయులుగా చేయడం సరైంది కాదని విమర్శించారు. మూసీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వమేనని చెప్పారు.
నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, గోదావరి నీటిని తీసుకువచ్చి మూసీని శుద్ధి చేయాలనే ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చూస్తే తుగ్లక్ పాలన గుర్తుకు వస్తోందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
రోజుకో పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారు….
ఒకసారి మూసీ సుందరీకరణ అంటారని, మరోసారి మూసీ ప్రక్షాళన అంటారని, ఇంకోసారి మూసీ పునరుజ్జీవనం అంటారని విమర్శించారు. రోజుకో పేరుతో ప్రజల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి పేరుతో హైదరాబాద్లో విధ్వంసం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో మూసీ బ్యూటిఫికేషన్ టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు.
రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మిస్ వరల్డ్ పోటీలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శించారు. సింగరేణి నిధులతో ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా ఆరోపించారు.
మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్
మూసీ అభివృద్ధి పేరిట అసలు ఉద్దేశం రియల్ ఎస్టేట్ దందానేనని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం 3279.19 ఎకరాల పరిధిలో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించిందని, దీని వల్ల లక్ష మందికి పైగా ప్రజలు ప్రభావితమవుతారని తెలిపారు. రెండున్నరేళ్లలో పది ఇళ్లు కూడా కట్టని ప్రభుత్వం పది వేల ఇళ్లను కూల్చే హక్కు ఎక్కడి నుంచి తెచ్చుకుందని ప్రశ్నించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇళ్లను కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. ఎలాంటి హైడ్రాలజికల్ లేదా వరద నీటి అధ్యయనం జరిగిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి మూసీ ప్రాజెక్ట్కు రుణం మంజూరైందని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పటివరకు డీపీఆర్ కూడా సమర్పించలేదని ఏడీబీ వెల్లడించిందని తెలిపారు.
చాదర్ ఘాట్ ప్రాంతంలో ఇళ్లు కూలగొట్టడం ఎంత వరకు కరెక్టు?
అసెంబ్లీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రవిలేజ్ మోషన్ ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే చాదర్ఘాట్ ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతంలో 300 ఇళ్లను కూల్చారని హరీశ్ రావు తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా ప్రజలను తరలించడం సరైంది కాదన్నారు.
మూసీ వెంట ఉన్న మొత్తం 46 కాలనీలలోని ప్రజలకు కూడా మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చే విధంగా స్థలం, ఇళ్లు కల్పిస్తారా అని ప్రశ్నించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయని, వాటి విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మూసీ బాధితులు తనను కలవడానికి వచ్చినప్పుడు వారిని హౌస్ అరెస్ట్ చేశారని హరీశ్ రావు ఆరోపించారు. భయాందోళనల మధ్య ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని అన్నారు. అలాగే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని చెప్పడం ద్వారా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇస్తుందా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి మూసీ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని కోరారు.
