నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల పనితీరుపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లు వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్లోని సాయి కృప ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక బాలికకు అక్రమ అబార్షన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
వైద్య ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, నిబంధనలు ఉల్లంఘించిన సాయి కృప ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రైవేట్ ఆసుపత్రులలో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం-2010ని పక్కాగా అమలు చేయాలని, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడే వారిపై రాజీ లేని పోరాటం చేయాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రైవేట్ వైద్య సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని ఈ సమావేశం ద్వారా జిల్లా యంత్రాంగం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
