క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సర్క్యూలర్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా అటు పారిశ్రామిక వృద్ధిని, ఇటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు.
సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్టలో “జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఆధ్వర్యంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్ కు ఆదివారం నిర్వహించిన భూమి పూజకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటికీ మన దేశం సుమారు 90 శాతం ముడి చమురును, 60 శాతం ఎల్పీజీని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే “క్లీన్ ఎనర్జీ”నే కీలకమన్నారు. అందుకు… గ్రామాలు ఇంధన కేంద్రాలుగా మారాలని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
పరిశ్రమలను కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా గ్రామాలకు విస్తరిస్తున్నామన్నారు. నర్మెట్టలో ప్రారంభించబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడి రైతులు కేవలం ‘అన్నదాత’లుగానే కాకుండా, దేశానికి ఇంధనాన్ని అందించే ‘ఉర్జదాతలు’గా చరిత్ర సృష్టిస్తారన్నారు.
మూడు దశల్లో క్లస్టర్ పద్ధతిలో నిర్మించబోయే 10 సీబీజీ ప్లాంట్ల(సామర్థ్యం 100 టన్స్ పర్ డే)లో వరి గడ్డి, ఆవు పేడ, కోళ్ల వ్యర్థాలతో బయో ఫ్యూయల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఇక్కడ సుమారు 1400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో 30 శాతం మంది మహిళలే ఉంటారన్నారు.
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు భువనేశ్వర్ ఖైతా, ప్రేమచంద్రన్, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ బాగ్రోడియా, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాయపాటి సాంబశివరావు, జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాయపాటి నాగశరత్ తదితరులు పాల్గొన్నారు.
