ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్ చైతన్యపురిలోని తన నివాసం వద్ద గోడపై ఈ మేరకు వాల్ రైటింగ్ చేశారు.
ప్రతి ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధిసహా కార్యకర్తలంతా తమ తమ డివిజన్లలో మోదీ సభ తేదీ, సమయం, ప్రాంతం తెలిసేలా వాల్ రైటింగ్ తోపాటు వినూత్న రీతిలో ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ తరువాత మోదీ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారని, ఈ నేపథ్యంలో లక్షలాది మందితో నిర్వహించే సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలపై ఉందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు. స్వచ్ఛందంగా తరలివచ్చే వారి కోసం రవాణా, కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని కోరారు.
ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డీ.శంకర్, గుగ్గిళ్ల రమేశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జే.సంగప్ప, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే సభకు రానున్న నేపథ్యంలో బహిరంగ విజయవంతం, జన సమీకరణపై ఆయా నేతలతో పాయల శంకర్ చర్చించారు.ఈ సందర్భంగా బండి సంజయ్, పాయల శంకర్ ఏమన్నారంటే…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలి. కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దాం. వేలాది సంఖ్యలో ప్రజలను పరేడ్ మైదానానికి తరలిద్దాం.
బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలి. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. మీ గ్రామాలు, వార్డులు, మండలాల పరిధిలో వాల్ రైటింగ్ రాయించండి. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలి. మోదీ సభ సక్సెస్ తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదాం.
