గచ్చిబౌలి పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద కొనసాగుతున్న రహదారి అభివృద్ధి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుండి డీఎల్ఎఫ్ జంక్షన్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ మరియు రహదారి విస్తరణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
శేర్లింగంపల్లి ఏడీసీపీ హనుమంతరావు, సిఎంసి (CMC) అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన సీపీ, పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అధికారులు తో మాట్లాడుతూ, నిర్మాణ పనుల దృష్ట్యా రాబోయే మూడు నెలల పాటు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ అమలు చేసి, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.
రహదారి అభివృద్ధి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం గచ్చిబౌలి–డీఎల్ఎఫ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్హెచ్ఓ సురేష్, సిఎంసి అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
