సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ఆర్డిఓ బాలకృష్ణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెన్సస్ 2027 కార్యక్రమంలో ప్రతి పౌరుడు తన హక్కుగా స్వీయ జనగణనలో నమోదు చేసుకోవాలని అన్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ను (se.census.gov.in) విడుదల చేసింది. చదువుకున్న యువత, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా డిఫెన్స్ అకాడమీల్లో మిలిటరీ శిక్షణ పొందుతున్న విద్యార్థులు, క్రీడాకారులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నరసరావుపేటలో స్వీయ జనగణన అవగాహన కోసం పైలాన్ ఏర్పాటు చేశామని, వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కలెక్టర్, ఆర్డీవోలతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం ఉందన్నారు. జనగణన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మీడియా సోదరులు, చిన్నారులు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశంలో మొదటిసారి పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహించనున్న సెన్సస్ 2027 మొదటి దశ (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్) లో ఏప్రిల్ 16 – 30 వరకు స్వీయ జనగణన సౌకర్యం అందుబాటులో ఉంది. ఆ తర్వాత మే 1 నుంచి 30 వరకు ఇంటింటికీ ఎన్యుమరేటర్లు డిజిటల్ యాప్ ద్వారా సమాచారం సేకరించనున్నారు.
ఈ ప్రక్రియలో ప్రజలు se.census.gov.in పోర్టల్ ద్వారా సులభంగా తమ ఇంటి వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ 5కే రన్ కార్యక్రమం ద్వారా నరసరావుపేట నియోజకవర్గంలో స్వీయ జనగణనపై విస్తృత అవగాహన కల్పించారు.
