అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సుమారు 131 నగరాలు లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి.
కేవలం సైనిక స్థావరాలే కాకుండా, వ్యూహాత్మక ప్రాంతాలను కూడా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు మరియు 9 యుద్ధ నౌకలను కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.
ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని, వారి సైనిక సామర్థ్యం నామరూపాలు లేకుండా పోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలతో పాటు, గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ డ్రోన్లు మరియు క్షిపణులతో టార్గెట్ చేస్తోంది.
అరబ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్కు వ్యతిరేకంగా రంగంలోకి వస్తుండటంతో యుద్ధం మరింత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భద్రతా సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మృతుల్లో ఎక్కువ మంది పౌరులు మరియు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వారసత్వ ప్రణాళికపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో, ఈ దాడులు ఆ దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ హింసను ఆపాలని కోరుతున్నప్పటికీ, యుద్ధం మాత్రం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
