అమరావతిని అత్యాధునిక వసతులతో వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చేదిద్దే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం రైతుల నుంచి రెండో విడతలో మరో 16 వేల 666.57 ఎకరాల భూములను సమీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో భూములు తీసుకోవాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఉండగా..వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో ఉన్నాయి.
రెండో విడతలో సేకరించనున్న భూముల్లో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరంతోపాటు అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. ఇక, ఈ ఏడు గ్రామాల పరిధిలో 3 వేల 828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఐతే ఈ భూముల్లో ఎక్కువగా కొండలు, గుట్టలు, చెరువులు ఉన్నాయి. ఇక, రాజధాని నిర్మాణానికి తొలవిడతలో భూమి సేకరించిన రైతులకు అమలు చేసిన ప్యాకేజీనే ఈ ఏడు గ్రామాల ప్రజలకు వర్తింపజేయనున్నారు. జరీబు భూములకు ఎకరానికి 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య స్థలం, మెట్ట భూములకైతే ఎకరానికి 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య స్థలం కేటాయించనున్నారు. ఇక ఏటా కౌలు చెల్లించనున్నారు.
ఇక భవిష్యత్తులో మరింత భూసమీకరణ చేయనున్నారు. అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు స్మార్ట్ ఇండస్ట్రీస్ జోన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని పనులు వేగం పుంజుకోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. ఇక, క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైతే దానికి అనుబంధంగా అనేక ఎడ్యూకేషనల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు కానున్నాయి. వాటికోసం భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూమిని సమీకరించనున్నారు.
