రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పార్టీలకతీతంగా ఉంటాయని, ప్రజలకు మేలు చేసే పనులు మాత్రమే చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి సర్పంచ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని కోరుతూ, తమ పార్టీ విజయం సాధించిన చోట్లే స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పారు.
గత పదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్న గ్రామాల్లో ఒక్క అడుగు అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ మూడు ముక్కలుగా విడిపోయే స్థితిలో ఉందని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయని, ముఖ్యంగా కెసిఆర్ కూతురు కవిత తన పార్టీ నేతల అవకతవకలను స్వయంగా బయటపెడుతున్న పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
బీజేపీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని, వారి హామీలపై నమ్మకం కోల్పోయారని అన్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, ఆ అభివృద్ధిని అందించగలిగేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
