తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్)కు సిట్ నోటీస్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా విమర్శించారు. పరిపాలనా విధివిధానాలు తెలియని వారు పాలకులుగా ఉండటం రాష్ట్రానికి దురదృష్టకరమని ఆయన అన్నారు.
నియంత్రుత్వ పోకడలకు ప్రజలే తగిన సమయంలో అడ్డుకట్ట వేస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్ సాధారణ రాజకీయ నాయకుడు కాదని, తెలంగాణ ఉద్యమంలో పుట్టిన శక్తి అని క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాసానికి ఆయన ప్రతిరూపమని అన్నారు. కన్నీళ్లతో వలస వెళ్లిన తెలంగాణ బిడ్డల కళ్లలో ఆనందం నింపిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాల మాగాణి భూములకు సాగునీరు అందించి రైతులకు సిరులు పండించారని ప్రశంసించారు. రైతు బంధు ద్వారా రైతులకు భరోసా కల్పించిన రైతు బాంధవుడు కేసీఆర్ అని అన్నారు. దళిత బంధు పథకంతో దళితుల ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసిన దళిత బాంధవుడిగా ఆయనను అభివర్ణించారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా నిలిచారని, కేసీఆర్ కిట్ ద్వారా తల్లి–బిడ్డల క్షేమాన్ని కాపాడారని క్రాంతి కిరణ్ వెల్లడించారు. ఇలాంటి నాయకుడిపై రాజకీయ కక్షతో చర్యలు చేపట్టడం ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
