కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్య క్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. మఠ సంప్రదాయాలను అనుసరించి ముందుగా కనకదాసులవారి గుడికి వెళ్లి కనకన కిండి నుంచి మూలవిరాట్ ను దర్శించుకున్నారు. అనంతరం మఠంలోని అనంతేశ్వర ఆలయాన్ని సందర్శించి, లింగ రూపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తరువాత అదృశ్యరూపంలో ఉన్న జగద్గురు శ్రీ మద్వాచార్యులు వారిని దర్శించుకున్నారు. ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించడానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కి వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మఠంలో వినియోగించే సాంప్రదాయ వాయిద్యాలతో ఆహ్వానించారు. ముందుగా మధ్వసరోవరంలో ప్రోక్షణ చేసుకొని ప్రధాన ఆలయంలోకి విచ్చేసిన పనవ్ కళ్యాణ్ కి శ్రీకృష్ణ మఠం పర్యాయ మఠాధిపతి అయిన శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ స్వయంగా దగ్గరుండి శ్రీకృష్ణుడి దర్శనం చేయించారు.
కోటి గీతా లేఖన యజ్ఞం సంకల్పాన్ని చేయించారు. భగవద్గీతను ప్రచారం చేయడానికి, పఠించడానికి వీలుగా నిర్మించిన గీతా మందిరాన్ని శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీతో కలిసి పవన్ కళ్యాణ్ సందర్శించారు. భగవద్గీతలోని ముఖ్యమైన ఘట్టాలు, 700 శ్లోకాలు పఠించడానికి వీలుగా గోడలపై లిఖించారు. లిఖించిన శ్లోకాల సారాన్ని స్వామిజీ పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఉడుపి సందర్శన అనంతరం 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న కుంభాసి అనే పుణ్యక్షేత్రాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ క్షేత్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆనెగుడ్డె శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి మంగుళూరు చేరుకొని విజయవాడకు పయనమయ్యారు.
