ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్లోని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి ఈడీ కోర్టులో వారిని హాజరుపరిచారు.
మద్యం అక్రమ రవాణా కేసుపై సిట్ ఛార్జ్ షీట్ ఆధారంగా కేసు నమోదు చేసింది. మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ OSD కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలతో పాటు APSBCL పూర్వపు ఎండీ డి.వాసుదేవరెడ్డి, APSBCL ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి.కిరణ్కుమార్రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపుల సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను ఈ కేసులో నిందితులుగా చేర్చింది.
మద్యం రవాణా టెండర్లలో ప్రభుత్వానికి దాదాపు రూ.195 కోట్లు నష్టం వాటిల్లినట్లు తేల్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ నిధులు ఎక్కడికి తరలివెళ్లాయో వెలికి తీస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఇళ్లతో పాటు మరో ఆరుగురి నిందితుల ఇళ్లలో ఉదయం నుంచి తనిఖీలు చేశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు జరిగాయి.
హైదరాబాద్ నానక్రామ్గూడలోనిరాజ్ కెసిరెడ్డి నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను నాంపల్లి కోర్టుకు తరలించారు.
మరోవైపు దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావటంతో పాటు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.3,200 కోట్ల ముడుపులను కల్పిత, ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ దర్యాప్తులో మూలాలను వెలికితీస్తోంది.
