భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రానున్న 35 -40 సంవత్సరాల వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు 670 మీటర్ల పొడవున 60 అడుగుల వెడల్పు తో తెనాలి రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్లు మంగళగిరి నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు.
శనివారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. ఎంటిఎంసీ పరిధిలోని తెనాలి రోడ్డు విస్తరణ అంశం ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న ప్రతిపాదనే అని, ఈ నేపథ్యంలో గత నాలుగైదు నెలలుగా రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.
ఇప్పటికే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిపారు. నగరంలోని మిద్దె సెంటర్ నుంచి రాజీవ్ సెంటర్ వరకు 60 అడుగులు, గౌతమ బుద్ధ రోడ్డు నుంచి మిద్దె సెంటర్ వరకు 40 అడుగులు రోడ్డుగా ప్రస్తుతం ఉందని, అయితే తెనాలి రోడ్డును యూనిఫామ్ గా 60 అడుగుల రోడ్డుగా విస్తరించడం జరుగుతుందన్నారు.
ఇదే మార్గంలో ముస్లింల ఖబర్ స్థాన్ ఉందని, అయితే దీనిపై ముస్లిం సోదరులు ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. మత విశ్వాసాలను గౌరవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఖబర్ స్థాన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.
కబర్ స్థాన్ వద్ద రోడ్డు మధ్యలో మాత్రమే ఫిల్లర్ వేయడం జరుగుతుందని, పంజాగుట్ట ఫ్లైఓవర్ తరహాలో తెనాలి రోడ్డును క్యాంటీ లివర్ (ఫ్లైఓవర్) రహదారిగా నిర్మించడం జరుగుతుందన్నారు. తద్వారా ముస్లింల ఖబర్ స్థాన్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.
వాస్తవానికి తెనాలి రోడ్డు విస్తరణకు సాంకేతిక సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. తెనాలి రోడ్డు విస్తరణకు మున్సిపల్ సాధారణ నిధులు రూ. 16.93 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. తెనాలి రోడ్డు విస్తరణ కు మొత్తం 105 నిర్మాణాలపై ప్రభావం పడనుందని, వాటిలో 77 77 నిర్మాణాలు పాక్షికంగా, మరో 28 నిర్మాణాలు పూర్తిగా తొలగించాల్సి ఉందన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలకు గానూ రూ. 12.5 కోట్లను యజమానులకు నష్టపరిహారంగా అందజేయడం జరుగుతుందన్నారు. స్థలం కోల్పోయిన యజమానులకు 1:4 రేషియోలో సుమారు రూ. 40 కోట్ల విలువైన టీడిఆర్ బాండ్లు కేటాయించడం జరుగుతుందన్నారు.
అవసరమైతే గృహ యజమానులు టీడీఆర్ బాండ్లను నిరభ్యంతరంగా విక్రయించుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు.
