తన అక్కను వదిలేసి రెండో వివాహం చేసుకున్న భావను బామ్మర్ది అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలే దారుణ హత్య జగడంతో స్థానికంగా కలకలం రేపింది. అత్తాపూర్ సిఐ నాగేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం…. సులేమాన్ నగర్ లో నివాసం ఉండే మహమ్మద్ ఖదీర్ (36) జూనియర్ అడ్వకేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నాడు.
గత ఎనిమిదేళ్ల క్రితం తాబస్సుమ్ ఫాతిమాతో ఖదీర్ కు వివాహం జరిగింది.ఖాదిర్, తాబస్సుమ్ ఫాతిమాలకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి సంతానం. ఈమధ్య ఫాతిమాతో విభేదాలు రావడంతో ఖదీర్ మరో మహిళ సిమ్రాన్ ను 6 నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి ఫాతిమాను వదిలేసి సిమ్రాన్ వద్దే ఉంటున్నాడు.
తన అక్కను కాదని మరో వివాహం చేసుకున్న బావపై ఫాతిమా తమ్ముడు కోపం పెంచుకున్నాడు. శనివారం మధ్యాహ్నం సులేమాన్ నగర్ లోని తన ఆఫీసులో ఖదీర్ ఒంటరిగా ఉండగా ఫాతిమా తమ్ముడు అనిఫ్ బావతో మాట్లాడేందుకు నలుగురు వ్యక్తులతో కలిసి వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే అనీఫ్ అతని స్నేహితులు కట్టే, చాకుతో ఖదిర్ పై దాడి చేశారు.
కత్తితో ఖదీర్ కడుపులో పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ పరిశీలించారు.
కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్సై పార్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
