మంగళాద్రి దివ్యక్షేత్రంలో మాల్యవంతం వంశీకులు వంశపారంపర్యంగా మంగళాద్రి పురాధీశుడైనటువంటి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వార్ల పాద సేవ, అర్చనలతో తరిస్తోంది. ప్రస్తుతం ఏడో తరంలో మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం ప్రధాన అర్చకులుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు.
మాల్యవంతం వంశీకుల్లో గోపాలచార్య, నరసింహాచార్యులు, రాజగోపాలచార్యులు, వెంకటకృష్ణమాచార్యులు, సీతారామచార్యులు, లక్ష్మీనరసింహాచార్యులు, ప్రస్తుతం శ్రీనివాసదీక్షితులు శ్రీస్వామివారికి సేవచేస్తున్నారు. మాల్యవంతం వంశీకులు వందేళ్లకు పైగా సంక్రాంతి సందర్భంగా తమ నివాసంలో బొమ్మలకొలువు ఏర్పాటుచేయడం జరుతోంది.
ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా చిన్నారులకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ముత్తయిదువులచేత బోగిపళ్లు పోసి ఆశీర్వచనాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు పెదకోనేరు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి దేవస్థానం సమీపంలోని తమ స్వగృహంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.
ఈ బొమ్మలకొలువులో దశావతారాలు, జంతువుల అవతారాలు వంటి విశేషమైన బొమ్మలతో చూడముచ్చటగా మాల్యవంతం కుటుంబసభ్యులు ఏర్పాటుచేయడం విశేషం.మరీముఖ్యంగా ఈ బొమ్మలకొలువు ఏర్పాటుద్వారా మన తర్వాతి తరానికి మన ఆచార, వ్యవహారాలు, వాటి విశిష్టతలను తెలియజేయడం ప్రధాన ఉద్దేశం.
శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం ప్రధానఅర్చకులుగా వున్న మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు కుటుంబం ఏర్పాటుచేసిన బొమ్మలకొలువుకు బంధుమిత్రులతోపాటు సమీప నివాసితులు మరీ ముఖ్యంగా మహిళలు విచ్చేసి బొమ్మలకొలువును తనివితీరా వీక్షించారు.
ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బొమ్మలకొలువును కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసేందుకు ముచ్చటపడ్డారు. బొమ్మలకొలువును తిలకించేందుకు విచ్చేసిన ముత్తయిదవులకు మాల్యవంతం కుటుంబసభ్యులు పసుపుకుంకుమలు అందించి మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
మాల్యవంతం వంశీకులు వంశపారంపర్యంగా సంక్రాంతిసందర్భంగా బొమ్మలకొలువును ఏర్పాటుచేయడం.. అదీ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం విశేషంగా చెప్పుకున్నారు తిలకించిన మహిళలు. మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ… భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తెలియజెప్పాలనే ఉద్దేశం ప్రశంసనీయం.
