ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు కోనసీమ జిల్లాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏటా సంక్రాంతి సమయంలో కోనసీమ ప్రభల తీర్థం ఘనంగా నిర్వహిస్తారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రాచీన సంప్రదాయం.దాదాపు 500 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలు చూసేందుకు 5 లక్షల మందికిపైగా వస్తారని సమాచారం.
ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో ఆ రోజు కొలువుదీరతారని, వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారనేది కోనసీమ వాసుల నమ్మకం. ఈ ఏడాది జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కోనసీమ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గతంలో నిధుల లేమితో ఇబ్బంది పడిన నిర్వాహకులకు ఈసారి ప్రభుత్వ సహకారం లభించింది.
ముసలపల్లి భోగేశ్వర స్వామి ప్రభ తొలిగా జగ్గన్నతోటకు చేరుతుంది. చివరగా గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌశకినది దాటుకుంటూ తోటలోకి వస్తుంది. ఈ దృశ్యాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. కోనసీమలో 160 చోట్ల ప్రభల తీర్థాలు వైభవంగా కొనసాగుతాయి. అంబాజీపేట ప్రభల తీర్థానికి 300 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక, ప్రకాశం, పల్నాడు,గుంటూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు జోరుగా సాగాయి.ఆత్రేయపురంలో కేరళ తరహాలో నిర్వహించిన పడవల పోటీలు ఈ ఏడాది హైలైట్గా నిలిచాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
