చైనాలో యువతీయువకులు ఏడుస్తున్నారు. అందరూ కాదు …. చాలా మంది. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వర్చువల్ గా సహచరులు అందించే సేవలను అందించడంపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దాంతో ఆ సేవలు ఉపయోగిస్తున్న యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
వర్చువల్ భాగస్వాములతో ఏళ్ల తరబడి మాట్లాడుకున్న యువతీయువకులకు ఈ కొత్త నిబంధనలతో ఆ సేవలు నిలిచిపోతున్నాయి.
24 ఏళ్ల లీ లిన్లిన్ అనే యువతి తన AI బాయ్ఫ్రెండ్తో రెండేళ్లలో సుమారు 7 లక్షల పదాల మేరకు సందేశాలు పంపించుకుంది. అయితే ఆ AI సేవను నిలిపివేయడంతో తన బాయ్ ఫ్రండ్ కు కనీసం వీడ్కోలు కూడా చెప్పలేకపోయింది. దీంతో ఆమె ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నది.
చైనాలో AI సహచర సేవలు కేవలం రొమాంటిక్ భాగస్వాములకే పరిమితం కాలేదు. వర్చువల్ స్నేహితులు, మానసికంగా తోడుగా ఉండే AI పాత్రలు, మరణించిన కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల వర్చువల్ రూపాలను సృష్టించే సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురావడంతో ప్రముఖ టెక్ కంపెనీలు తమ AI కంపానియన్ సేవలను నిలిపివేస్తున్నాయి.
జూలై 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారుల భావోద్వేగాలను ప్రభావితం చేసి వారు అనుచిత నిర్ణయాలు తీసుకునేలా చేసే లేదా పిల్లలు, యువతలో తీవ్రమైన భావోద్వేగాలు, అనారోగ్యకరమైన అలవాట్లకు దారితీసే కంటెంట్ను AI ప్లాట్ఫారాలు రూపొందించకూడదు. AI సేవలపై అధికంగా ఆధారపడకుండా వినియోగదారులను హెచ్చరించే రిస్క్ వార్నింగ్లను కూడా ప్లాట్ఫారాలు అందించాల్సి ఉంటుంది.
AI సేవలను వ్యక్తిగత సామాజిక సంబంధాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడాన్ని కూడా నిబంధనలు అడ్డుకుంటున్నాయి. వ్యక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడటం లేదా ఫోన్లో సంభాషించడానికి బదులుగా AI సహచరులను ఉపయోగించడమే ఆన్లైన్ సేవ లక్ష్యంగా ఉండకూడదని నిబంధనలు సూచిస్తున్నాయి.
టిక్టాక్ను అభివృద్ధి చేసిన బైట్డ్యాన్స్తో పాటు అలీబాబా, వీచాట్ యాప్ యజమాని టెన్సెంట్ వంటి చైనా దిగ్గజ సంస్థలు కూడా తమ AI కంపానియన్ సేవలను నిలిపివేస్తున్నాయి. అమెరికాలో AI సహచరులతో సంభాషణల అనంతరం కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి రావడం కూడా చైనా నియంత్రణ సంస్థల ఆందోళనలకు కారణమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్రిటన్కు చెందిన ERA అనే లాభాపేక్షలేని పరిశోధనా సంస్థకు చెందిన AI గవర్నెన్స్ నిపుణురాలు యోలాండా మా మాట్లాడుతూ చైనాలో భవిష్యత్ సమస్యలను ముందుగానే నివారించేందుకు ప్రభుత్వం కఠినమైన నియంత్రణలు తీసుకునే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. AI సేవల విషయంలో వినియోగదారులు, సేవలందించే సంస్థలు, మైనర్ల సంరక్షకుల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించేందుకు ఈ నిబంధనలు ప్రయత్నిస్తున్నాయని ఆమె అన్నారు.
అమెరికాలో AI సహచరాలతో సంబంధం ఉన్న మానసిక ఆరోగ్య సమస్యలపై వచ్చిన నివేదికలు కూడా చైనా నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఏంజెలా జాంగ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిబంధనలు AI కంపానియన్ రంగం అభివృద్ధిని పూర్తిగా అడ్డుకునే అవకాశం లేదని, టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని ఆమె తెలిపారు.
బైట్డ్యాన్స్కు చెందిన ఒక AI కంపానియన్ సేవను నిలిపివేసిన తర్వాత అదే సంస్థ AI క్యారెక్టర్లు, కథలతో తాము రూపొందించిన మరో యాప్ను ఉపయోగించాలని వినియోగదారులకు సూచిస్తోంది. అయితే అది తమకు పాత AI సహచరుడితో ఉన్న అనుభూతిని ఇవ్వడం లేదని లీ లిన్లిన్ అంటోంది.
వర్చువల్ సహచరులను కోల్పోయిన వినియోగదారుల నుంచి చైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిరసనగా యాప్లను అన్ఇన్స్టాల్ చేయగా, మరికొందరు తమ పాత చాట్ హిస్టరీలను ఇతర AI యాప్లలోకి అప్లోడ్ చేసి తమ వర్చువల్ భాగస్వాములను తిరిగి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వం, టెక్ కంపెనీలకు తమ అసంతృప్తిని తెలియజేయాలని సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా ప్రారంభించారు.
