వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనడం గమనార్హం. ఒక ప్లాన్ ప్రకారం అకస్మాత్తుగా ఈ దాడికి వైసీపీ గూండాలు తెగబడ్డారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ ఈ రాద్ధాంతం చేసింది.
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసిన కథనంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడ సాగించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిపై వైసీపీ నాయకులు అసభ్య దూషణలు చేశారు. ఆందోళన ముసుగులో దాడులు చేసి మీడియా సంస్థలను భయపెట్టాలని వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
‘మావిగన్’ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ ఈ కుయుక్తులకు పాల్పడుతోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. అమరావతి చట్టబద్ధతను అవమానిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది. మావిగన్ పేరుతో అమరావతిపై విషంకక్కే ప్రయత్నాన్ని ప్రజల ముందు ఉంచింది ఏబీఎన్.
మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులకు వైసీపీ మూకలు యత్నించాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోయాయి.
